నేను సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకొచ్చాను. నేను పుట్టినపుడు మా తాతగారు మళ్లీ ఆడపిల్లేనా? అని మా అమ్మను కసురుకుని నన్ను నెల రోజుల వరకు చూడలేదు అని మా అమ్మ ఇప్పటికి చెప్తుంటుంది. అప్పటి మేమున్న పరిస్థితుల్లో ఆడపిల్లంటే పోషణభారం అని అనుకుని ఉంటారు. అప్పటి కాలానికి ఇంకా అమ్మాయిలు చదివి ఉద్యోగాలు చేసేంత లేదు సమాజ పరిస్థితి.అందులోనూ అమ్మాయిలకు కట్నకానుకలిచ్చి పెళ్లి చేయాలి అని సమాజం ఆలోచించేది.అందుకు తాతగారు మినహాయింపు కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మా ఇంటి రేషన్ కార్డులో రెండపేరు అబ్బాయిపేరు రాయించారు నేను పుట్టకముందే అబ్బాయే పుడతాడు అనుకుని. నేను ఈ విషయంలో ఇప్పటికి మా అమ్మవాళ్ళతో గొడవచేస్తుంటాను.
నేను పుట్టే సమయానికి మేము దిగువమధ్యతరగతి వాళ్ళం. మా అమ్మవాళ్లు ప్రసవం అయిన నెలరోజులకే ఇంటిపనులన్నీ చేసుకునవాళ్ళంట. మా అమ్మగారికి 3 సంవత్సరాల వయసులోనే మా
అమ్మమ్మగారు చనిపోయారు.మా అమ్మని జాగ్రత్తగా చూసుకునే మా మామయ్య నేను పుట్టిన 2 సంవత్సరాలకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను 5వతరగతి చదువుతున్నపుడు ఒకసారి మా ఊరికివచ్చారు. వచ్చినా తన విషయాలేవీ మాకు చెప్పలేదు. మా అమ్మ గారికి వున్న ఒక్క అక్క bonemarrow cancer తో చనిపోయింది. మా అమ్మ కుటుంబం తరపు మాకు ఎలాంటి ఆదరణలేదు. ఈ విషయాల్లో మా అమ్మగారు చాలా బాధపడుతుంటారు ఇప్పటికి.
మా అమ్మ ఆ కాలంలోనే SSLC చదివింది.తర్వాత మమ్మల్ని కూడా అంత బాగా చదివించింది.ఒక్క విషయం మాత్రం మాకు పదే పదే చెప్పేద ఎవరుఉన్న,లేకపోయి మనకు జీవితాంతం తోడుగాఉండి ఇంత అన్నంపెట్టేది చదువేనని,అది జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను.నేను చిన్నప్పుడు అంటే 3-4సంవత్సరాలవయసులో చుట్టాల ఇంటికి వెళ్ళినపుడు నాకు తెలిసిన పద్యాలన్నీ చెప్తుంటే అందరూ పదేపదే బాగా చెప్పిందని మెచ్చుకున్నారుట.దాంతో నాకు బాగా దిష్టితగిలి 3 రోజులు జ్వరం వచ్చేసిందట. ఆ కాలంలో పిల్లలు ఏం చెప్పినా అద్భుతంగా ఉండేది. కానీ, ఇప్పుడో బడికిపోకముందే ఇంగ్లీష్మాట్లాడాలి,ఇంగ్లీష్లోనే ఏడవాలి,నవ్వాలి. ఇంకా చెప్పాలంటే 2వ సంవత్సరం నుంచే బడికి తోలి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేంత వరకు తోముతారు.
ఇంకొక జ్ఞాపకం..పరీక్ష రోజున మేము వ్రాసిన సమాధానాలన్నీ ఇంటికి వచ్చి మా అమ్మకు అప్పజెప్పాలి. అమ్మకు అన్నిటికి సమాధానాలు ఎలా గుర్తుంటాయో అని తెగ ఆశ్చర్యపడేదాన్ని.కానీ మేము అప్పజెప్పే విధానాన్ని బట్టి మేము సరిగ్గా వ్రాశామో లేదో కనిపెట్టేసేది. : ) : ) ఇలా అడుగుతుందని వ్రాయని సమాధానాలు చూసి నేర్చుకునేవాళ్ళం. ఇవి తర్వాత వ్రాసే పరీక్షలకు ఉపయోగపడేవి. ఇప్పటికి కూడా నేను తప్పు వ్రాసిన సమాధానాలను వెంటనే refer చేసి నన్ను నేను update చేసుకుంటూ ఉంటాను.చిన్నపుడు నేను చదివిన సుమతీ,వేమన శతక పద్యాలు నాకు చాలా ఇష్టం. ఈ కాలం పిల్లలకి అవి ఏంటో కూడా తెలిసే అవకాశం లేదు. అందరూ మేము వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో వెళ్ళామని చెప్తే నాకు కూడా అలా గడపాలని అనిపిస్తుండేది. కాని అంత అదృష్టం లేదు మాకు. ఇంట్లోనే మా అమ్మతోనే ఉండే వాళ్ళం. మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దింది కాబట్టి ఇలా ఈరోజు ఉన్నతంగా బతుకుతున్నాం. ఇంకా ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువ అవుతుంది.